LATEST POSTS

10/recent/ticker-posts

టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి..సందర్భంగా

ధైర్యసాహాసహాసలకు అరడుగుల బుల్లె ట్.. అవినీతిపరుల గుండెల్లో డైనమేట్..మనఆంధ్రరాష్ట్రనికి మొదటి సామ్రాట్ ఐన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి..


"గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు  ప్రకాశం"  ..అయ్యదేవర కాళేశ్వరరావు.

"ప్రమాదములున్నచోటే  ప్రకాశంగారుంటారు" ...భోగరాజు పట్టాభి సీతారామయ్య

★సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి.

● నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు.

● 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు.

★మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి  'ఆంధ్రకేసరి' అని పేరు పొందినవాడు.

♻బాల్యం..

■ టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని  టంగుటూరిలో వారి కుటుంబం వంశపారం పర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే ఇద్దరు కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసేవిధంగా, ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గర్లో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం తాతగారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో ఆఖరి వాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు.

■ఆయనకు11యేట తండ్రిమరణించడంతో,  పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.

♻చదువు..

■ వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్అవడం కష్టమయ్యింది.మిషను పాఠశాల  ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంత రావు నాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు  రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ.లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు. ప్రకాశం1890 లో  తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలం పాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి,1894లో  మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ,పుష్కలంగా సంపద  సంపాదిం చాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.

♻ఇంగ్లాండులో విద్యాభ్యాసం..

■అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు. కనుక పైస్థాయికోర్టులలో వాదించడానికి అర్హతలేదు.  బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది.  దాంతో ప్రకాశం1904లో ఇంగ్లాండువెళ్ళాడు.  దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు. అక్కడ భారతీయసొసైటీలో చేరి దాదాభాయినౌరోజీ  బ్రిటీషు  పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.


♻బారిష్టరుగా...

■1907లో, లండనులో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు  హైకోర్టులో  ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో  ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రథముడు.

●ప్రకాశం పౌర మరియు నేర వ్యాజ్యాల నన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్యకేసు ఒక ప్రసిద్ధి చెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్,1907లో కాల్చిచంపబడ్డా డు. ఈ సంఘటన బెంగాల్ కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరిత మైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో, ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశాడు. ప్రకాశం, లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవాడు.

●అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు.  లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి,1921అక్టోబరు లో సత్యాగ్రహ  ప్రతినపై సంతకం చేశాడు.1921లో స్వాతం త్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలి పెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ,దేశసేవకే ఖర్చు చేసాడు.

♻ప్రజాసేవలో...

●లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న  'స్వరాజ్య పత్రిక'కు సంపాదకత్వం చేపట్టాడు.

●ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు.

●1921డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు  ముల్తాన్ లోనూ పర్యటించాడు.  కేరళలో  మోప్లా తిరుగుబాటు సమయంలో బయటి ప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచే యకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవ సానంగా ఊటీ లోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు.

 ●1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వఛ్ఛందకు లతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 

●1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ  అభ్యర్థిగా ఎన్నికైనాడు. అక్కడ విఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా  మరియు జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకు లు ప్రకాశం సహచరులు.

♻రాజకీయ జీవితం..

●1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

●1921 అక్టోబర్ 29 న 'స్వరాజ్య' అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 

★1928లో మద్రాసులోసైమన్‌ కమిషను  బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు "ఆంధ్ర కేసరి" అనే బిరుదునిచ్చి గౌరవించారు.

●1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన పుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.

 ●1946లో మద్రాసురాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొన సాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా 'ప్రజాపార్టీ 'ని స్థాపించాడు.

●1937లో కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ ఎన్నికల లో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు  మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చు కున్నది. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం ముందున్నప్పటికీ, క్రియాశీల రాజకీ యాలకు తిరిగివచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా, కాంగ్రెసు అధిష్టాన వర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. రాజాజీ  మంత్రివర్గంలో ప్రకాశం రెవిన్యూ శాఖామంత్రి గా పనిచేశాడు. మంత్రిగా  జమిందారీ వ్యవస్థ వలన వ్యవసాయరంగములో జరుగుతున్న అవకతవకలను పరిశీలించటానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షత వహించటం జరిగింది.

●1941లో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం ప్రథముడు.

●1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు.   

●1946లో కాంగ్రెసు పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది. 

●ఈ తరుణంలో 1946ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన  కె.కామరాజ్, జాతీయ నాయకులైన  గాంధీ  మరియు నెహ్రూల అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు. అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.

♻స్వాతంత్ర్యానంతరం...

■సామాన్య ప్రజలసంక్షేమార్ధమై ప్రకాశం,తన వ్యక్తిగత భద్రతను, జవహర్ లాల్ నెహ్రూ  చేసిన హెచ్చరికలనూ, లెక్కచేయకుండా  1948లో నిజాం పాలనలోఉన్న హైదరాబాదు  రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయసహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలిసి, రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

■1952లో ప్రజాపార్టీని స్థాపించి అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ మంత్రులందరూ ఎన్నికల లో ఓడిపోయేట్టు చేశాడు.అయితే ప్రజాపార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరక పోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే బలనిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది.

★అంతలో1952 డిసెంబర్లో పొట్టిశ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరా హార దీక్ష చేస్తూ మరణించటంతో  ఉద్యమం  తీవ్రతరమైంది. ఉద్యమ ఫలితంగా 1953  అక్టోబర్‌ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం  ఏర్పడిన ప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి.

●రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో  శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం,  విజయవాడవద్ద కృష్ణానదిపై బారేజి నిర్మాణం  వీటిలో ప్రముఖమైనవి.

● కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతి రేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహ రించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.

●1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నాడు.

★1956, నవంబర్1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం,ఆంధ్రరాష్ట్రం లో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది.

★ ప్రకాశం అనుయాయి ఐన నీలం సంజీవ రెడ్డి సమైక్యరాష్ట్రానికి తొలి CM అయ్యాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించాడు. అలాంటి ఒక ఒంగోలుపర్యటనలో వడదెబ్బ కు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రి లో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957,  మే 20న పరమపదించాడు.

♻ఆత్మకథ..

■ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర" పేరిట 4 భాగాల పుస్తకంగా విడుదల అయింది.  ఇందులో 3 భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం  తెన్నేటి విశ్వనాథం  వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.

●ఈ పుస్తకం మన గ్రూప్ మిత్రులకు అందు బాటులో  ఉంచుతున్నందుకు ఆనందంగా వుంది.

♻ప్రకాశం జిల్లా ఏర్పాటు..

■ టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో 3తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో 4తాలూకాలు(కందుకూరు, కనిగిరి, పొదిలి,  దర్శి),  కర్నూలు జిల్లాలో 2 తాలూకాలు (మా ర్కాపురం, గిద్దలూరు)కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

★టంగుటూరి ప్రకాశం గారి జయంతిని ప్రభుత్వం 'రాష్ట్ర పండుగ'గా GOMS No 113dt 21/8/17 ద్వారా ప్రకటించి.. విద్యార్థులలో,ప్రజల్లో ఆయన త్యాగాలను, ధైర్య సాహసాలను తెలియజేయడం మంచి పరిణామంగా భావిద్దాం..

 (ఆగష్టు 23, 1872 – మే 20, 1957)



Post a Comment

0 Comments